Wednesday, January 1, 2020

నాకు నచ్చిన పాట ...ఓహో యాత్రికుడా...


“అంధకార దీర్ఘ నిశా బంధనమ్ము సడలించుక,
గంధవాహ తురంగమ స్యందనమ్ము గదలించుక,
సింధుపార పూర్వ దిశా సుందర తీరమ్ము జేరు నో యాత్రికుడా.... “

నాకు చాలా ఇష్టమైన పాటలో మరీ ఇష్టమైన లైన్స్ ఇవి. ఆ పదాల నడక రాజేశ్వర్రావు గారు పాడిన తీరు ఒకెత్తూ, ఈ లైన్ అర్థం కావట్లేదు తాతయ్యా అంటే ఆయన దాన్ని నాకు విపులీకరించి చెప్పిన తీరు మరో ఎత్తు. ఆయన చెప్పిన పద్దతి నేనెప్పటికీ మర్చిపోలేను. మంచం మీద కూర్చుని, చూపుని ఊహలో నిలిపి ఆయన ఈ వాక్యాలకు అర్థం చెప్పిన తీరూ, అప్పుడు నా కళ్ల ముందు నిలిచిన ఇమేజ్ ఇప్పటికీ ఠక్కున గుర్తొస్తాయి - అంత అందంగా చెప్పారు ఆయన. ఈ పాట విన్న ప్రతిసారీ లేదా నాలో నేను పాడుకున్న ప్రతిసారీ ఈ పంక్తుల దగ్గర నా కన్ను- తన రథాన్ని ముందుకు ఉరికిస్తూ, సింధువు ఆవలి తీరపు తూర్పు వేకువ వైపుకి నూతనోత్సాహంతో ఎగిరిపోతున్న, ఎదిగిపోతున్న ఒక అస్పష్టపు మనిషి రూపుని – ఒక ఉద్విగ్న క్షణాన్ని చూస్తుంది. నిజం.

అదెలాంటి వేకువ? బంగారు, పసుపు, లేత గులాబీ రంగుల్ని అకాశం ఇష్టమొచ్చినట్టు ఒంపేసుకుంటుంటే వాటిని చీల్చుకుని అడ్డు నిలిచిన మంచుతెరల్ని దాటుకుని కురుస్తున్న వెలుతురా? మనిషిలో అందాకా నిదురబోతున్న అంతఃచేతన మేల్కొని మనసునావరించిన క్లేశాలనూ అవరోధాలనూ ఆవేశాలనూ తనని తనలా ఉండనివ్వని అన్నింటినీ ఒక గమనింపుతో జారవిడిచి, తనని తను నిజంగా పూర్ణంగా ఆనందంగా చూసుకునే క్షణమా?? వీటన్నిటి కలబోతా? నాకలాగే అనిపిస్తుంది. యాత్రికుడు చేరబోయే సుందర తీరం అదేనని అనిపిస్తుంది.

ఈ పాట తెలీని వారు ఓ సారి వింటారనీ, తెలిసీ ఇష్టపడిన వారు మరోసారి వింటారనీ షేర్ చేస్తున్నాను.

Hope you all will enjoy the song.

పాట: ఓహో యాత్రికుడా
రచన: మల్లవరపు విశ్వేశ్వరరావు గారు (‘కల్యాణ కింకిణి’ పుస్తకంలో ‘వసంత యాత్ర’ అనే కవిత)
సంగీతం మరియు గానం : సాలూరు రాజేశ్వర్రావు గారు.


https://www.youtube.com/watch?v=STp7l2CcrmU&fbclid=IwAR200ys7fKsQAKh18uBE5OvfIyMMi9AAaZd1EwMHea5wJ9RMZ3l29p2tK-M




****************************************************